Friday, October 23, 2009

నాస్తికుడు

నాస్తికుడగు జీవుడు భగవంతుని అంగీకరించపోవుటకు కారణము వానిలో మేరు, వింధ్య శైలముల వలెనున్న అసూయ అహంకారములే. భగవంతుడనగా తన కన్న ఎన్నో రెట్లు గొప్పవాడని అర్ధము. భగము కలవాడు భగవంతుడు. భగము అనగా మతాత్మము అనగా గొప్పతనము. బ్రహ్మము అను శబ్ధమునకు కూడ గొప్పతనము కలది అనియే అర్ధము. తనకన్న లేక తన జాతియగు మానవజాతి కన్న గొప్పవానిని నాస్తికుడు అంగీకరించడు. భారతదేశమంతయును ఇట్టి నాస్తికులతోను పూర్వ మీమాంసకులతోను నిండియుండెను. వీరే కాక విష్ణువు యొక్క అవతారమగు కపిలమహర్షిని కూడా అపార్ధము చేసుకున్న శిష్యులు కూడా నాస్తికులుగనే యుండిరి. కపిలుడు ప్రకృతి పురుషుని గూర్చి చర్చించెను. పురుషుడు ప్రకృతి చేత లిప్తుడు కాడు అను అసంగ వాదనను కపిలుడు బోధించినాడు. "అసంగో హయః పురుషః" అన్నాడు కపిలుడు. కపిలుడు చెప్పిన పురుషుడు జీవుడని భ్రమించి జీవుడు ప్రకృతి చేత లిప్తుడు కాడని శిష్యులు అపార్ధము చేసుకున్నారు. కాని కపిలుడు చెప్పిన పురుషుడు అవతార పురుషుడు. ఈ అవతార పురుషుడు అగు స్వామి తన యొక్క శరీరమగు ప్రకృతి యొక్క క్షుత్పిపాసాది ధర్మముల చేత లిప్తుడుకాడనియే దీని అర్ధము. అనగా తీగెలో విద్యుత్త్తు ప్రవహించునపుడు సన్నగా యుండుట వంకరలు కలిగియుండుట మొదలగునవి తీగె ధర్మములు విద్యుత్‌ యొక్క ధర్మము కానందున విద్యుత్‌ను అంటవని అర్ధము. విద్యుత్తు లేని తీగె యొక్క ఈ ధర్మములు తీగె ధర్మములు కావున తీగెను అంటియే యుండును. అనగా క్షుత్పిపాసాది ధర్మములు జీవుని ధర్మములు కావున జీవుని అంటియే యుండును. ఈ జ్ఞానమును తెలుసుకొనుటయే సాంఖ్యము అనబడును. సాంఖ్యము అనగా జ్ఞానము అని అర్ధము కావున విష్ణువు యొక్క అవతారముగు కపిలుడు నాస్తికుడు ఎట్లు అగును? అట్లే కొందరు మూఢులు శివుని అవతారమగు శంకరులను ప్రచ్ఛన్న బౌద్ధుడని దూషించినారు. నాస్తికుని ఉద్ధరింప వలయున్నచో అతడు 5 మెట్లు ఎక్కవలయును.

1వ మెట్టు: పరమాత్మ ఉన్నాడు. కాని అతడు నిరాకారుడు. ఈ మెట్టులో పరమాత్మ సాకారుడని అంగీకరించుటకు అసూయ అహంకారములు కొంత తగ్గినను అడ్డువచ్చును.

2వ మెట్టు: పరమాత్మ సాకారుడు. కాని భూలోకములో కాక పైలోకములలో ఉండును. మొదటి మెట్టు కన్న అసూయ అహంకారములు మరికొంత తగ్గును.

3వ మెట్టు: పరమాత్మ నరాకారుడు కాని వర్తమానమున లేడు. అనగా గతించిన రామకృష్ణాది అవతారములు. రెండవ మెట్టు కన్న అసూయ అహంకారములు మరికొంత తగ్గినవి.

4వ మెట్టు: పరమాత్మ నరాకారుడే. వర్తమానమున ఉన్నాడు. అయితే స్వార్ధమగు ఐహికములకు గానీ, మోక్షమునకు గానీ అతడిని ఆశ్రయించుచున్నాము.మూడవ మెట్టు కన్న అసూయ అహంకారములు మరికొంత తగ్గినవి.

5వ మెట్టు: వర్తమానుడగు నరాకారుడు అగు పరమాత్మను పూర్తిగా స్వార్ధమును త్యజించి, సేవించుటయే బ్రహ్మప్రాప్తి. ఈ దశలో అసూయ అహంకారములు పూర్తిగా నశించినవి.

పరుగెత్తుచున్న మదవృషభమును నిలద్రొక్కుటకు దానితో పాటు కొన్ని అడుగులు వేయవలెను. ఒక్కొక్క అడుగునకు దాని వేగము తగ్గుచు ఉండును. కొన్ని అడుగుల తర్వాత ఒక అడుగులో వేగము పూర్తిగా తగ్గి అది నిలబడును. అదే విధముగా శ్రీ దత్త సద్గురువు శంకర రామానుజ మధ్వ రూపముల నాస్తికులను మద వృషభమును అనుసరించి అడుగులు వేయుచూ క్రమముగా నాస్తికులను మార్చుచూ చివరకు మధ్వాచార్య రూపమున 5 వ మెట్టు నకు ఎక్కించినాడు.

మొదట శంకరులు నాస్ధికుని జీవులందరునూ బ్రహ్మమే కావున నీవు జ్ఞానము చేత బ్రహ్మము అగుదువు. నీవే దేవుడవు. నీవు ఉన్నావు కాన దేముడున్నాడు. నీవు నిరాకారమైన చైతన్యము కావున, నిరాకారమైన దేముడున్నాడు. అని మొదటి మెట్టును ఎక్కించెను. ఆ తర్వాత శివస్తోత్రములగు శివానందలహరి మొదలగు వాటి ద్వారా సాకారుడైన దేముడు పైలోకములో ఉన్నాడు అని రెండవ మెట్టునెక్కించెను. ఆ తరువాత భజగోవింద స్తోత్రముల ద్వారా గతించిపోయిన నరాకారుడగు కృష్ణుడగు పరమాత్మ ఉన్నాడని మూడవ మెట్టు ఎక్కించెను. క్రమముగా శంకరులను, శిష్యులు ఆశ్రయించినారు.వారికి నేను నేనే శంకరుడను శివోహం, శివోహం అని స్తోత్రము ద్వారా బీధించి వర్తమాన నరావతారుడగు పరమాత్మ తానేనని వచించినారు. ఇది నాలుగవ మెట్టు. అయితే ఈ నాలుగవ మెట్టులో ఐహికములు, మోక్షమును ఆశించి శిష్యులు ఆశ్రయించిరి. తోటకుడు తన మూగి తనమును పోగొట్టమని ఐహికమును ఆశించి శిష్యుడైనాడు. ఆట్లే సురేశ్వరుడు మోక్షమును ఇమ్మని కోరుచు శిష్యుడైనాడు. ఈ నాలుగ మెట్టులో జీవుడు బ్రహ్మము కావచ్చునన్న ఆశ ఇంకనూ మిగిలియేయున్నది. అనగా స్వార్ధము కొరకే నాలుగవ మెట్టు ఎక్కినారు. ఈ సమయములో శంకరులు శివుడు హాలాహలము త్రాగినట్లు కరిగిన సీసమును త్రాగి జీవుడు ఈశ్వరుడు కాడని నిరూపించినాడు. మరియు జీవుడగు తాను మాత్రమే ఈశ్వరుడనని తేల్చినాడు. దీనితో శిష్యులు నిరాశచెందినారు. తను నిరాశను పోగొట్టుకొనుటకు జీవుడే బ్రహ్మమన్న వాదనకు దిగినాడు. ఇచ్చట శంకర రూపము నిష్క్రమించినది. రామానుజ రూపము వచ్చినది. నిరాశ చెందిన వారికి మరల కొంత ఉత్సాహమును కల్పించినారు. నీవు ఈశ్వరుడవు కాలేవు కాని పరమాత్మ శరీరములో ఒక భాగమై యున్నావు. భక్తిచేత ఆయన యొక్క శరీర అవయము వలె ఆత్మీయుడవు కావచ్చును అని బోధించినాడు. తాను కూడా పరమాత్మ యొక్క శరీర అవయవమే అన్నాడు. తాను శేషావతారమన్నాడు. శేషుడనగా శరీర అవయవము అని అన్నాడు. శేషుడు శయ్యగా శరీరముతో నిత్య సంబంధము కలదు. ఈ శేషశేషి సంబంధమే విశిష్టాద్వైతము. ఈ విధముగా శంకరులు జ్ఞానమును, రామానుజులు భక్తిని పరిపూర్ణము చేసినారు. ఇచ్చట రామానుజులు నిష్క్రమించినారు. ఇప్పుడు మధ్వరూపము వచ్చిది. మధ్వులు జీవుడు స్వామి కన్న వేరుగా ఉన్న ఒక నిత్య సేవకుడనియు, తాను ఆంజనేయుని అవతారమనియు బోధించినారు. ఇదియే ఐదవ మెట్టు.

శంకరులు నేను బ్రహ్మము, నీవు బ్రహ్మము కావచ్చునన్నారు. రామానుజులు నేను శరిరావయమును. నీవును స్వామి శరీరములోని అవయవమే భక్తిచేత స్వామికి ప్రియమైన అవయవము కావచ్చును అన్నారు. మధ్వులు నేను స్వామి సేవకుడను సేవ ద్వారా నీవును స్వామి సేవకుడవు కావచ్చున్నారు. జీవులు: ఎట్లు గురువులు ఏ స్ధితిలో ఉన్నారో ఆ స్ధితిని మీరు కూడా పొందవచ్చును అని ఆశ కూడా చూపించుట చేతనే స్వార్ధము వల్లనే జీవులు ఆకర్షితులు అయినారు. కాని చిట్ట చివరిలో మధ్వులు హనుమంతుడు ఎట్లు తాను ఉన్న కాలములో వున్న నరాకారుడగు స్వామిని ఐహిక, మోక్షకామములు లేక నిస్వార్ధముగా సేవించవలెనని అదియే మోక్ష కైవల్యములని ఐదవ మెట్టుకు చేర్చి నిష్క్రమించినాడు. ఇట్లు నాస్తికుని, హనుమంతుని స్ధితికి తీసుకు వచ్చినాడు. శ్రీ దత్త సద్గురువు శంకరులు జీవుడే బ్రహ్మ మని చెప్పిన వాదమును జాగ్రత్తగా పరిశీలించినచో సత్యము బోధపడును. జీవుడు బ్రహ్మము అన్నారు. నిజమే, కాని బ్రహ్మమనగా ఏమని చెప్పినారి?బ్రహ్మమనగా చైతన్యమని అర్ధము చెప్పినారు. ప్రత్యక్షమైన ఈ విషయములో చైతన్యము కన్నా గొప్ప పదార్ధము లేదు. ఈ చైతన్యము రాజులోను బిచ్చగానిలోను సమానముగా ఉన్నది. కావున రాజులోని జీవుడు బిచ్చగానిలోని జీవుడు చైతన్యమే. అనగా బ్రహ్మమే. నిర్మల గంగానదిలోను, బురద గుంటలోను సూర్యుని ప్రతిబింబము కనపడుచున్నది. ఆ రెండింటిలోను ప్రతిబింబించిన సూర్య ప్రతిబింబము ఒక్కటే. ఈ సూర్య ప్రతిబింబము బ్రహ్మము కానీ, గంగనీరు, బురదనీరు ఒకటియగునా? గంగనీరే ఈశ్వరుడు.బురదనీరే మానవుడు. ఈశ్వరుడిలోను, మానవునిలోను జీవుడు లేక ఆత్మయను ఒకే చైతన్యము గలదు. ఉదాహరణమునకు కృష్ణునిలోను, యాదవునిలోని ఒకే చైతన్యాత్మ వున్నది. కాని కృష్ణుడు గోవర్ధనమును ఎతినాడు. యాదవుడు ఒక బండను కూడా ఎత్తలేదు. ఇది ఉపాధికి సంబంధించిన జీవేశ్వరుల బేధమము. ఈ జీవేశ్వర బేధమును శంకరులు," "అనుప పత్తృహెః" అను బ్రహ్మ సూత్రములలో స్ధాపించినారు. "సత్యపి బేధాపరమే" అను శ్లోకమున ఓ ఈశ్వరా! నీకును జీవుడగునాకును అద్వైతము వున్ననూ నీలోనే నున్నాను. నీవు నీలో మాత్రమే లేవు. నాకు బయిటనూ ఉన్నావు. సముద్రములో తరంగము ఉన్నది, కాని సముద్రము ఒక్క తరంగమందే లేదు అని వచించినారు. జీవుడు బ్రహ్మమన్నారే కాని ఈశ్వరుడన లేదు. జీవేశ్వర బేధమును కరిగిన సీసము త్రాగుట ద్వారా, శంకరులు ఆచరణలోనే నిరూపించినారు.
At the lotus feet of Shri Dattaswami
-Durgaprasad

Wednesday, October 21, 2009

జీవుడు జీవుడే. దేవుడు దేవుడే.

"పరోక్ష ప్రియాఇవహి దేవాః ప్రత్యక్ష ద్విషః" అని శ్రుతి. అనగా దేవతలు సహితము ఎదురుగా నున్న దానిని ద్వేషింతురు. పరోక్షముగా ఉన్న దానిని ఆరాధింతురు. ఇక మానవుల విషయము చెప్పనేల? దేవతలు, ఋషులు సహితము అసూయ అహంకారము అను రెండు మహా సర్ప దంపతుల బారిన పడక తప్పదు. జీవునికి గల షడ్గుణములలో చిట్ట చివరిది మాత్సర్యము. దీనిని ఎవ్వరును అతిక్రమించలేరు. దేవతల అంశ గల పాండవుల సహితము స్వామి ఎన్ని విధముల బోధించినను గయుని వదలి పెట్టమన్నారు. స్వామి చెప్పినదే వేదము, స్వామి ఆచరించినదే ధర్మము అను పరాభక్తిని త్రోసిపుచ్చినారు. ప్రతి జీవుడిలోను సత్వము, రజస్సు, తమస్సు అను మూడు గుణములు ఉండును. సాత్వకుడు అనగా సత్వగుణము ఎక్కువ పాళ్ళలో కలవాడు. సత్వము నుండి జ్ఞానము జనించును. "సత్వాత్‌ సంజాయతే జ్ఞానం" అని గీత. నూరు పాళ్ళు సత్వగుణము ఉన్నవాళ్ళు పరిపూర్ణ జ్ఞాని, సర్వఙ్ఞడు. సర్వఙ్ఞడు అనగా పరమాత్మయే అని అర్ధము. కావున ఎంత జ్ఞాని అయినను కొంత అజ్ఞానము ఉండక తప్పదు. ఈ అజ్ఞానము ఒక్కొక్క జీవునిలో ఒక్కొక్క సమయమున ప్రకోపించి ఉండునని గీత చెప్పుచున్నది. కృష్ణుడు పరమాత్మయేనని నమ్మి పరిపూర్ణ విశ్వాసము గల సాత్వికులగు పాండవులు సహితము గయుని విషయము నందు అజ్ఞాన ప్రభావములోపడిరి. హనుమంతుడు జ్ఞానులలో శ్రేష్ఠుడు. బుద్ధిమతాం వరిష్టం అనిపించుకున్నవాడు. కాని యయాతి రక్షణ విషయమున హనుమంతుడు సహితము అజ్ఞాన ప్రభావమునకు లొంగినాడు. యయాతిని తనకు అప్పగించమని స్వామి తనను ఆదేశించినాడు. స్వామి కోరినదే కర్తవ్యము అను పరాభక్తిని క్షణకాలము మాయ కప్పినది. తల్లియగు అంజనాదేవి యమాతిని రక్షించమని పుత్రుని ఆదేశించినది. స్వామి ఎక్కువా? తల్లి ఎక్కువ? అయనతో సమానుడు కాని అధికుడు గాని లేడు.

"న తత్సమః" అని శ్రుతి చెప్పిచున్నది. దీనికి కారణము స్వామి కృష్ణునిగా, రామునిగా నర స్వరూపమున కన్నుల ఎదుట ఉండుటయే. కావుననే భగవానుడు "మనుష్యాణాం సహస్రేషు కచ్చిత్‌ యతతి సిద్ధయే యతతామ్‌పి సిద్ధానాం కస్చిన్‌ వేతి తత్వత్‌" అని గీతలో వచించినాడు. అనగా స్వామి నరాకారమున ప్రత్యక్షముగ యుండగా గుర్తించుటకు ప్రయత్నించు వాడే వేలాది వేలలో ఒక్కడుండును. అట్లు ప్రయత్నించిన భక్తులలో ఏ ఒక్కరో స్వామిని గుర్తించి పూర్ణముగా విశ్వసింతురు. అట్లు పూర్ణముగా విశ్వసించిన వారు సైహితము ఎదో ఒక క్షణకాలమైనను అనుమానము రాక తప్పదు. దీనికి కారణము ఏ జీవునికైనను పరిపూర్ణ బ్రహ్మ జ్ఞానము అసంభవము. "బ్రహ్మవిత్‌ బ్రహ్మైవ భవతి" అని శ్రుతి. అనగా పరిపూర్ణ బ్రహ్మజ్ఞానము గలవాడు పరమాత్మ ఒక్కడే. కావుననే ఆయన మీద క్షణకాలము కూడా అనుమానము రానివాడు ఆయన ఒక్కడే. దీని అర్ధము అసూయా అహంకారములు సాధనచే క్షీణించునే కాని ఏ జీవునకు పూర్తిగా నశించవు. కావున ఏ జీవుడు బ్రహ్మము కాడు. జీవుడు జీవుడే. దేవుడు దేవుడే.

ఒక కార్యము కొరకు దేవుడు జీవుని ఆవహించవచ్చును. ఆ సమయమున జీవునకును దేవునకును అద్వైతమే అయినప్పటికిని, ఆ కార్యము ముగిసిన తర్వాత దేవుడు తొలగిపోగా జీవుడు జీవుడే అగును. స్విచ్‌ని ఆపివేయగా విద్యుత్‌ తీగెలో ప్రసరించదు. అప్పుడు అది మామూలు తీగెయే అగును. క్షత్రియ సంహారము ముగియగా విష్ణువు అను విద్యుత్తు తొలగిపోవగా పరశురాముడు అను తీగె మామూలు తీగెగా మిగిలెను. అనగా ఆయన ఒక ఋషి మాత్రమే. దానినే అవేశావతారము అందురు. కాని రాముడు అట్టి తీగె కాదు. జననము మొదలు తుది నిమిషము వరకు రాముడు విద్యుత్‌ తీగెయే. కావున రాముని పూర్ణావతారమందురు. కృష్ణుడును అంతే. తుది శ్వాస విడచిన తర్వాత కృష్ణుని శరీరము కూడ విద్యుత్‌ పోయిన తీగెయే. కావుననే అర్జునుడు ఆ శరీరమునకు దహన సంస్కారములు చేసెను. దావాగ్నిని మింగి గోపికలను రక్షించిన ఆ కృష్ణ శరీరము ఆనాడు పరిమితమైన అగ్ని చేత దగ్దముగావింపబడెను. అయితే రామ, కృష్ణ శరీరములు ప్రాణము ఉన్నంత వరకు విద్యుత్‌ తీగెలు గనే ఉండెను. రాముడు తాను దేవుడని ఎవ్వరకునూ చెప్పలేదు. కావున పూర్ణావతారము. కాని కృష్ణుడు మాత్రము అనేక సమయములందు తాను దేవుడని ప్రకటించినాడు. కావున అది పరిపూర్ణవతారము. రాముడు ఉన్నప్పుడు ఆయనకు భక్తుల సంఖ్య ఎక్కువ శత్రువుల సంఖ్య తక్కువ. కృష్ణుడు ఉన్నప్పుడు భక్తుల సంఖ్య తక్కువ శత్రువుల సంఖ్య ఎక్కువ. దీనికి కారణమేమి?

రాముడు తాను దేవుడనని చెప్పలేదు కావున రాముడు దేవుడని విశ్వసించిన వారు ఎక్కువ. కృష్ణుడు తాను దేవుడనని చెప్పినందున విశ్వసించిన వారు చాలా తక్కువ. దీని తాత్పర్యమేనగా ఒక మానవుడు దేవుడని విశ్వసించు వారి సంఖ్యయే తక్కువ. దేవుడు జీవుడెట్లు అగును? అని వారి ప్రశ్న. నిజమే. జీవుడు జీవుడే దేవుడు దేవుడే. కాని జీవుని దేవుడు ఆశ్రయించినప్పుడు జీవత్వము మూగపోవును. దైవత్వము ప్రకటించబడును. తీగెను చేతితో పట్టుకొని ఆడుకొనవచ్చును. కాని తీగెలో విద్యుత్‌ ప్రవేశించినపుడు ఆ తీగెను స్పర్శ కూడా చేయలేము. ఏలననగా తీగె తన ధర్మములను మన కంటికి కోల్పోయినట్లు కనిపించకున్నను నిజముగా కోల్పోయి విద్యుత్‌ యొక్క ధర్మమునే పొందియున్నది.
At the lotus feet of Shri Dattaswami
-Durgaprasad

ద్వైత, విశిష్టాద్వైత, అద్వైతములు

శ్రీ దత్త భగవానుడు నిరంతరము మనుష్య శరీరమును ఆశ్రయించి యుండును. ఆ మనుష్య శరీరము సామాన్య మానవ శరీరము వలె ప్రకృతి ధర్మములు కలిగి పరిమితమైన శక్తినే కలిగియుండును. దీనికి కారణమేమనగా ఆయన నిరంతరము సద్భక్తులైన సజ్జనుల యొక్క దుష్కర్మ ఫలములను అనుభవించుచు కర్మ నియమానుసారము వారికి ఛాయా మాత్రముగనే ఆ కర్మ ఫల భోగముల నిచ్చుచూ, తాను అనుభవించుట వారికి తెలియనీయక పైకి చిరునవ్వు చిందించుచుండును. స్వామి అనిభవించుచున్నారని వారికి తెలిసినచో మంటలలో పడిన చిగురుటాకుల వలె వారు విలవిలలాడుదురు. కర్మఫలానుభవ సమయము నందు అల్పశక్తి గల ఒక మానవ శరీరము ఎంత భాధపడునో, అంత భాధను స్వామి అనుభవించును. అట్లు అనుభవించి ధర్మదేవతకు ఇచ్చిన మాటను నిలుపుకొనుచున్నాడు. కర్మఫలానిభవ కాలమున తన దివ్యశక్తినుపయోగించి భాధను తప్పించుకొన్నచో ధర్మ దేవతను మోసగించినట్లగును. కావున స్వామి శరీరము అల్పశక్తిని అల్పజ్ఞత్వమునే కలిగియుండును. ఆయన శరీరములో ఆతీంద్రియ శక్తులు ఉండవు. జరబోవునది తెలియదు. ఇట్లు అజ్ఞానముతో ఉండుట చేత ఆయన నిజముగా ఆ పాత్ర రసమును సంపూర్ణముగా రమించును. సినిమా చూచుచున్నప్పుడు రాబోవు కధ తెలిసినచో దాని యందు నిజమైన రమణము, వినోదము ఉండవు. ఇట్లు అజ్ఞానము స్వామి యొక్క వినోదమునకు కారణమగుచున్నది. ఇది శివ స్వరూపము. అజ్ఞానమయమైన తమోగుణము. కావుననే స్వామి నామములలో 'మూఢాయ నమః' అని కలదు. ఇట్టి పరిపూర్ణ అజ్ఞానములో సామాన్య మానవుని పాత్రలో సంపూర్ణముగా రమించుచున్నప్పుడు రాముడనబడును.
అయితే అప్పుడప్పుడు ఈ మానవత్వము నుండి దైవత్వము వైపుకు ఆకర్షితుడగును. ఇట్లు ఆకర్షింపబడిన వాడే కృష్ణుడు. అనగా అప్పుడప్పుడు మానవ శరీరములో దివ్యశక్తులు ప్రవేశించును. అయితే దివ్యశక్తి ప్రవేశించినను, ఆ మానవ శరీరము దివ్యత్వమును పొందజాలదు. అట్లు దివ్యత్వమును పొందినచో భక్తపాలనానుభవము అను కర్మ ఆగిపోవలసి వచ్చును. భక్తరక్షణ కర్మ ఎప్పుడును ఆగదు. కావున స్వామి శరీరము దివ్యత్వమును పొందదు. కావున దివ్యశక్తి ప్రవేశించినప్పుడు దాని ధాటికి స్వామి శరీరము భాధపడు చుండును. జ్ఞానులైన వారు, స్వామిని పరిపూర్ణముగా విశ్వసించిన వారు, స్వామి నుండి ఎట్టి మహిమలను చూడగోరరు. స్వామి నరాకారమున ఉండుట చేతనే శో్డశోపచార పూజకు సంపూర్ణ సార్ధకత వచ్చినది. స్వామీ! మా ఇంటికి వచ్చి భిక్షను స్వీకరించమని ప్రేమతో పిలుచుటయే "ఆవాహయామి" అను ఉపచారము. వచ్చిన స్వామికి ఉన్నతాసనము నీవు సమర్పించుటయే ఆసనము సమర్పయామి. ఇట్లే పాద్య, అర్ఘ్య, స్నానాదులు. స్వామి స్పష్టముగా చూచుటకే దీపము. మశక, మక్షికాదులను పారద్రోలుటకే ధూపము. స్వామికి భిక్ష సమర్పించుటయే నైవేద్యము. ఈ ఊపచారములన్నియును స్వామి యొక్క నరాకారమునకే జరిగెడివి. అట్టి నరాకారము లభించనిచో, మహాభక్తులకు ఈ పూజ జరిగెడిది. మహాభక్తుడు భగవంతునితో సమానుడు. "తన్మయాహితే" అను నారద భక్తి సూత్రము ప్రకారము మాహాభక్తుని దత్తుడు ఆవహించియుండును.

కావున అతడు సాక్షాత్తు భగవంతుడే. స్వామి యగు రాముడు భగవంతుడు అని మహా భక్తుడగు హనుమంతుడును భగవంతునితో సమానుడే. "భక్త్యా అనన్యయా లభ్యా" అను గీతా వాక్యము ప్రకారము, భగవంతుడు భక్తుని చేరియుండును. అట్టి భక్తుడు లభించనిచో యోగ్యులైన సజ్జనులకు ఆర్తులైన సాధువులకు ఈ పూజను చేసినచో, వారు ఆనందించినచో ఆ ఆనందము జీవాధారుడగు పరమాత్మకు చెంది పరమాత్మ ఆనందించును. స్వామి వేరు, స్వామిని ఆశ్రయించిన నరశరీరము వేరు అనుటయే ద్వైతము. ఈ ద్వైతములో సేవ్య సేవక సంబంధముండును. అనగా ఈ మనుష్య శరీరము స్వామి కార్యములో సేవకుని వలె పాల్గొనును. ఈ నర శరీరము స్వామి యొక్క పూర్ణ శరీరమైన ఈ జగత్తులో ఒక అల్ప భాగము. కావున ఈ నర శరీరము అవయవము లేక్స్ శేషము అనబడును. ఈ జగత్తు సర్వావయవములైన స్వామి శరీరము. కావున స్వామి 'అవయావి' లేక 'శేషి' అనబడును. ఇదే శేష శేషి సంబంధమును చెప్పు విశిష్టాద్వైతము. స్వామి పూర్ణ శరీరమగు జగత్తు చేతనులగు జీవులతో, అచేతనులగు పంచభూత కార్యములతోను నిండియున్నది. కావున జగత్తును స్వామి యొక్క చిదచిదాత్మక శరీరము అన్నారు రామానుజులు. చిత్‌ + అచిత్‌ = చిదచిత్‌. చిత్‌ అనగా జీవులు. అచిత్‌ అనగా నదీ, కొండ మొదలగు జడములగు స్ధావరములు. కావున శేషుడనగా జీవుడే. ఆయన శరీరములోని ఒక చిన్న కణమే జీవుడు. జీవుడు ఆత్మ అనబడుచున్నాడు. ఈ ఆత్మకు లోపల ఉన్న అంతరాత్మయే ఆత్మేశ్వరుడనగా స్వామి అనబడుచున్నాడు. "పతిం విశ్వ శ్వాత్మాశ్వరగ్‌ం" అను శ్రుతి జడమైన చేతనములగు ఆత్మలకు ఆయన పతి అని అర్ధము. "పృధ్వి శరీరం" అను శ్రుతియు ఆయన శరీరములో భూమి మొదలగు పంచభూతములున్నవి అని చెప్పుచున్నవి. గీతలో కూడా "యస్మాత్‌ క్షరాదతీతోహం అక్షరాదవి సోత్తమ అసోస్మి లోనే వేదేచ ప్రదితః పురుషోత్తమః" అని జడములగు క్షరముల కన్నను అక్షరులగు జీవుల కన్నను భిన్నుడు ఉత్తముడగు పురుషోత్తముడు వేరు అని చెప్పబడుచున్నది. ఆయన యొక్క ఊహలగు పంచభూతములగు జడములు ఆయనను శరీరము వలె ఆవరించి యున్నవి అర్ధము. ఈ విశ్వ శరీరము ఊహాత్మకము కాన విశ్వములో జరుగు వికారములు ఆయనను అంటవు. ఈ నర శరీరము దానిని ఆశ్రయించిన స్వామి తీగె విద్యుత్తుల వలె వేరుగనున్నను తీగె నంతయు విద్యుత్తు వ్యాపించి నందున అది విద్యుత్తు తీగె లేక విద్యుత్తే. ఇది అద్వైతము. ఇట్లు అవతార శరీరములో ద్వైత, విశిష్టాద్వైత, అద్వైతములను సమన్వయము చేయవచ్చును.
At the lotus feet of Shri Dattaswami
-Durgaprasad

Monday, October 19, 2009

తర్కము

గీత చెప్పినవాడు కృష్ణుడు. భాగవతము కృష్ణుని జీవిత చరిత్ర. కావున గీతా శ్లోకములను గీతా శ్లోకముతో సమన్వయించవలెను. అంతే కాని మానసికములైన శుష్క తర్కములతో సమన్వయించరాదు. ప్రతి మానవుడు పరబ్రహ్మమే అయినచో అర్జునుడును పరబ్రహ్మమే కదా. పరబ్రహ్మము సర్వజ్ఞుడు గదా. మరి అర్జునుడు పరబ్రహ్మమును ప్రశ్నలను ఎట్లు వేసినది? విశ్వరూపమును చూచి ఏల గడగడ వణికెను? ప్రతి మానవుడు పరబ్రహ్మమే అయినచో శంకరులు మాత్రమే ఏల కరిగిన సీసమును త్రాగెను. మిగిలిన శిష్యపరబ్రహ్మములు ఏల త్రాగలేకపోయిరి? సరె! దత్తుడు ఏల నిత్యము మనుష్య రూపమున ఉన్నాడు? దీనికి కారణము -దత్తుడనగా దానము. అనగా త్యాగము. దత్తుడు ఎల్లప్పుడును తన భక్తుల దుష్కర్మ ఫలములను అనుభవించి నిత్యసుఖములను కలుగచేయుచున్నాడు. అయితే భక్తుల చేత వారి దుష్కర్మ ఫలమును నూటిలో ఒకపాలు మాత్రమే అనుభవింప చేయుచున్నాడు. ఏలననగా కర్మ చేసినవాడు ఆ మాత్రమైనను అనుభవించక పోవుట పరమ దారుణమైన అన్యాయము. ఐతే భక్తులు ఆ ఒక్క పాలును కూడా అనుభవించు ఓర్పులేక నా వంద రూపాయిల జరిమానాలో 99 రూపాయిలు కట్టి ఒక రూపాయిని మాత్రము ఏల కట్టాలని దత్తుని నిలదీయుచున్నారు. అట్టి వారు కృతఘ్నులు. స్వార్ధ దుర్గంధముతో కూడిన మురికి గుంటలు. అట్టి వారి మాయరోగమును దత్తుడు బాగుగనే కుదుర్చుచున్నాడు. ఎట్లు అనగా వాడు కోరినట్లే వారి దుష్కర్మ ఫలమును 100 పాళ్ళు తీసివేయుచున్నాడు. ఆ వంద రూకల జరిమానాను మరుజన్మకు త్రోయుచున్నాడు.
మరుజన్మలో వడ్డీ పెరిగి అట్టివాడు రెండువందల రూకల జరిమానాను కట్టుచున్నాడు. ఇది అంతయు తెలియక తన దుష్కర్మ ఫలమును తాను మహాభక్తుడు కావున దత్తుడే అనుభవించినాడనియు లేక తన దుష్కర్మ ఫలమును నిశ్శేషముగా దత్తుడు రద్దు చేసినాడనియు తలచుచున్నాడు. ఈ విధముగా వారి జ్ఞానము అజ్ఞానముచే ఆ వృతమైనందున భ్రమలో పడుచున్నారని "అజ్ఞాని ఆవృతం జ్ఞానంతేన ముహ్యంతి జంతవః" అని గీత చెప్పుచున్నది. కాని సాధకులైన సద్బక్తులు లేకపోలేదు. అట్టి వారి కష్ట నివృత్తిని ఎప్పుడును యాచింపరు. వారికి కష్ట నివృత్తి ఎట్లు జరుగునో తెలియును. దానిని దత్తుడు అనుభవించి భాధపడునని వారికి తెలియును. ఇప్పటి కష్టములనే కాక రాబోవు జన్మలలోని కష్టములను కూడా ఇప్పుడే ఇమ్ము త్వరగా అనుభవింతుమని దత్తుని ప్రార్ధింతురు. వారి ఉద్దేశమేమనగా, అన్ని దుష్కర్మ ఫలములను ఇప్పుడే అనుభవించినచో దత్తుడు గ్రహించి భాధపడు అవకాశము ఎప్పటికిని ఉండదు గదా అని. ఇంత నిర్మల ప్రేమ స్వరూపులైన సద్బక్తుల రాబోవు దుష్కర్మ ఫలములను కూడా వారు కోరినట్లే ఇప్పుడే దత్తుడు ధ్వంసము చేయును. కాని ఎట్లు? వారి యొక్క ఇప్పటి రాబోవు దుష్కర్మ ఫలములనన్నింటిని ఇప్పుడే తాను అనుభవించి వారిని శాశ్వతముగా పాప విముక్తులను చేయుచున్నాడు. కావున నీలో అణుమాత్రమైనా స్వార్ధము లేనిచో నీ సర్వ దుష్కర్మల ఫలమును ఇప్పుడే అనుభవించి నిన్ను నిత్య ముక్తునిగా చేయుటకు నీ సర్వ దుష్కర్మ ఫలములకు ఆత్మను అర్పణము చేసుకొని అనగా దానము చేసుకున్నందున దత్తుడనబడుచున్నాడు. అయితే దత్తుడు సర్వ శక్తిమంతుడు గదా. కావున సర్వ దుష్కర్మ ఫలములను ఒక్కసారిగా అనుభవించగల శక్తిని కలిగియున్నాడు అనుకొనుట పొరపాటు స్వామి ధర్మ దేవునితో చేసుకొన్న ఒప్పందము ఏమి అనగా "నా భక్తుల దుష్కర్మ ఫలములను నేను సామాన్య మానవ శరీరము ద్వారా నరుడెంత భాధపడునో అంత భాధను నేను అనుభవించుచు నా దివ్యశక్తిని ఉపయోగించక నేను అనుభవించెదనని " స్వామి ప్రమాణము చేసియునన్నాడు. కర్మ ఫలములను అనుభవించియే తీరవలయును. "అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ" అనునదే ధర్మదేవుని మూల సూత్రము - తన సేవకుడు భక్తుడు అగు ధర్మదేవుని శాసనమునకు భంగము కలుగకుండా స్వామి నిరంతరము శాశ్వతముగా తనను తానే బలి పశువుగా చేసుకున్నాడు. ఇదే "అభధ్నన్‌ పురుషం పశుమ్‌" అను శ్రుతికి అర్ధము. అనగా పురుషుడగు పరమాత్మను బలిపశువుగా బంధించిరి అని అర్ధము. కావున నీ సర్వ దుష్కర్మ ఫలములను ఒకేసారి ఇప్పుడే అనుభవించగల శక్తి దత్తావతార నరావతారమునకు లేదు. కావున ఒక్కొక్కటి ఒకటి తరువాత మరియొకటిగా అనుభవించవలెను. ఇట్లు ఎందరో సద్బక్తులను విముక్తులను చేయవలయును. అందుచేతనే శ్రీ దత్త పరబ్రహ్మము నిరంతరము శాశ్వతముగా నరరూపములతో ఈ లోకముననే అవతరించి సంచరించవలసియున్నది. కావున పరోక్షముగ ఏదియును లేదనియు అంతయు ప్రత్యక్షముగా ఇచ్చటనే ఉన్నదనియు పరబ్రహ్మ జీవునిగా ఇచ్చటనే ఉన్నాడనియు శంకరులు చెప్పినారు. ఆ జీవుడు ఎవరో కాదు. అప్పుడు అవతరించిన శంకరులే. కావుననే "అహం బ్రహ్మాస్మి" అని చెప్పియున్నారు. కరిగిన సీసము త్రాగి ప్రతి జీవుడు బ్రహ్మము కాదని నిరూపించియూ యున్నాడు.

కావున "పవిత్రాణాయసాధూనాం" అనగా సద్భక్తుల రక్షణము కొరకు నేను ప్రతియుగమున అవతరించుచున్నాను అని చెప్పినప్పుడు ప్రతి మనుష్య తరమున అవతరించుచున్నానని అర్ధము. యుగము అనగా సంవత్సరము. చాలా ఎక్కువ సంవత్సరముల సమూహము కృతయుగమము మొదలను, తక్కువ సంవత్సరముల సమూహము మనుష్యతరము. ఒక్కొక్కసారి ప్రతి సంవత్సరము అవతరించుచున్నానని కూడా అర్ధము చెప్పవచ్చును. ఆ మనుష్య తరమున ఎందరి సద్భక్తుల దుష్కర్మ ఫలములననుభవింపవలయునో భాధను ఓర్చుకొను మనష్య శక్తి పరిమితముగా ఎన్ని మానవ శరీరములు తీసుకొనవలయునో స్వామి నిర్ణయించి అవతరించును. ఒకే సమయమున అనేక దత్తావతారములుండవచ్చును. ఒకే సమయమున శిరిడి సాయి, అక్కలకోట మహరాజ్‌ ఉన్నారు. నేను దత్తుడను అనుటయే అవివేకము. ఏలననగా తీగెలో ప్రవహించు విద్యుత్‌ ఫంకాను త్రిప్పుచుండగా తీగె నేను విద్యుత్‌ను నేనే ఫ్యానును త్రిప్పుచున్నాను అనుటయే అజ్ఞానము. ఇక ఒకేసారి నాలుగు తీగెలలో ఒకే విద్యుత్‌ ప్రవహించుచు ఒక తీగె ద్వారా ఫ్యాను త్రిప్పుచు, ఒకే తీగె ద్వారా లైటును వెలిగించుచు, ఒకే తీగె ద్వారా రెడియోను మ్రోగించుచు మరియొక తీగె ద్వారా ఉష్ణయానకమును వేడెక్కించుచూ ఉండగా ఫ్యానుకు అమరియున్న తీగే నేను మాత్రమే విద్యుత్తుననియు మిగిలిన తీగెలు మామూలు తీగెలేననియు వాగినట్లు నేను ఒక్కడనే దతత్తావతారుడను అని చెప్పు పౌండ్రక వాసుదేవుని అజ్ఞానము పరాకాష్టకు చెందినట్లుండును.
At the lotus feet of Shri Dattaswami
-Durgaprasad

Thursday, October 15, 2009

భీముడు

ధర్మరాజు అర్జునుల కన్నను ఆంజనేయ అంశ గల భీముడు ఉత్తమ సేవకుడు. భీముడు వాయుపుత్రుడు. "వాయుర్వై ఛేపిష్టో దేవతా" అను శ్రుతి ప్రకారము వాయువు అనగా దేవతలలో శ్రేష్టుడైనవాడు అనగా దేవదేవుడైన శివుడే. కావుననే శివావతారము హనుమంతుడు. హనుమంతుడు, భీముడు, మధ్వుడు ఈ మువ్వురు వాయుదేవుని అవతారములని ప్రసిద్ధి. ధర్మరాజు సత్వగుణము. అర్జునుడు రజోగుణము. భీముడు తమోగుణము. శివుడును తమోగుణ స్వరూపుడని శాస్త్రము. రజస్సు బ్రహ్మ, సత్వము విష్ణువు, తమస్సు శివుడు. "జ్ఞానం మహేశ్వరాధి ఛేత్‌" అని జ్ఞాన కారకుడు శివుడే. తమోగుణము అజ్ఞానము. శివుడు ఆది గురువని ప్రసిద్ధి. గురువుకు జ్ఞానము అజ్ఞానము రెండు తెలియవలయును. ఏ అజ్ఞానము వలన శిష్యుడు పొరపాటు పడునో దానిని గురించి శిష్యునకు గురువు వివరించును. శిష్యుని దోషములను బట్టి వాటికి కారణమగు ఆ అజ్ఞానమును వివరించిన కాని వాడు వానిని దిద్దుకొన లేడు. కావున గురువు జ్ఞానముతో పాటు అజ్ఞానమును కూడా వివరించవలయును. అసలు అజ్ఞానమును గురించి తెలుసుకొని దానిని తొలగించినచో, నిర్మలమైన జ్ఞానము బావినీటిలో మురికిని తొలగించినచో అదే స్వచ్చమైన జలమైనట్లు అచ్చటనే జ్ఞానము ప్రకాశించునని శంకరులు చెప్పినారు. "మత్తః స్ముతిః జ్ఞానం ఆపోహనంచ" అను గీతా శ్లోకము కూడా నా నుండియే జ్ఞానమును అజ్ఞానమును గురించి తెలియవలయునని చెప్పబడినది. స్వామి కురుక్షేత్ర రణమును నిశ్చయించినాడు. రజోగుణముతో యున్న అర్జనుడు అహంకారముతో స్వామి నిర్ణయమునకు విరుద్ధముగా యుద్ధము చేయరాదని తర్కించి విరమించినాడు. స్వామి ఎంతో బోధించి విశ్వరూపము చూపినగాని మరల దోవకు రాలేదు. కాని భీముడు స్వామి నిర్ణయమునకు వ్యతిరేక తర్కమును చేయక స్వామి నిర్ణయించినదే ధర్మమని యుద్ధమునకు సిద్ధమైనాడు. కావున పరిపూర్ణ విశ్వాసము గలవాడు సంపూర్ణ శరణాగతి చేసినవాడు భీముడే. స్వామి ధర్మరాజును అశ్వర్ధామ మరణించమని అబద్ధమాడమన్నాడు. కాని అది అధర్మమని ధర్మరాజు నిరాకరించినాడు. స్వామికి ఇష్టమైనదే ధర్మము. స్వామికి ఇష్టము కానిది అధర్మము. అను మహాభావమే పరాభక్తి, కాన ధర్మజుని విశ్వాసము పరిపూర్ణము కాదు. కానీ భీముడు స్వామి అశ్వర్ధామ యని నామకరణము చేసిన శతృసేనలోని ఒక ఏనుగును చంపి ఆశ్వర్ధామ మరణించెనని ద్రోణాచార్యునకు చెప్పమన్నాడు.భీముడు దానికి ఎట్టి వితర్కము చేయక అట్లే చేసి, అట్లే చెప్పినాడు. కాని ద్రోణుడు నీమాటను నమ్మను ధర్మరాజు చెప్పినచో నమ్ముదును అన్నాడు. మరల స్వామి ధర్మరాజును బ్రతిమిలాడగ ధర్మరాజు ససేమీరా అన్నాడు. సరే! చివరకు అశ్వర్ధామ యను గజము చంపబదెను అని అయినా అనమన్నాడు. ధర్మరాజు అట్లే అన్నాడు. అశ్వర్ధామ మరియు చంపబడెను అను రెండు శబ్ధముల వున్న "అను ఏనుగు" అను శబ్ధము వినబడకుండా పాంచజన్యమును పూరించినాడు. అప్పుడు ద్రోణునకు అశ్వర్ధామ చంపబడెను అను రెండు శబ్ధములే వినిపించినవి.

సత్వగుణ ప్రధానుడైన ధర్మరాజు ఇంత మొండిపట్టు ఏల పట్టినాడు? అట్లే అర్జునుడు 18 అధ్యాయములు గీత చెప్పు వరకును ఎందుకు మొండిగా కూర్చున్నాడు? ఆ మొండితనము భీమునిలో ఏలలేదు? అర్జునుడు రజోగుణము, ధర్మరాజు సత్వగుణము అన్నాము. రజో గుణము, సత్వగుణము ఉన్న వారిలో లోక జ్ఞానము ఎక్కువగా యుండును. వారిలో వారికి కనిపించని అహంకారము, అసూయ ఉండును. స్వామి చెప్పినట్లు వినవలయునా? అన్న అహంకారము అట్లు వినుటకు స్వామి గొప్పదనము ఏమున్నదిలే అన్న అసూయ వారికి తెలియకుండానే వారిలో ఉండును. కాని తమోగుణము కలవారికి లోకజ్ఞానము ఉండదు. కావున అహంకారము అసూయ వారిలో ఉండదు. స్వామికి తాను బానిస వంటి వాడినని సంపూర్ణమైన ప్రపత్తి భావము ఉండును. కావున అజ్ఞానము చాలా అవసరము. కాని దేని యొక్క అజ్ఞానము, లోకము యొక్క అజ్ఞానము. నీలో లౌకికము ఎంత ఎక్కువగా యుండునో నీవు స్వామి అంత దూరముగా యున్నావని తెలియుము. నీలో లౌకిక జ్ఞానము ఎంత తక్కువగా యుండ, అజ్ఞానిగా ఛాంధసునిగా ఎంత ఎక్కువగా యుండువో నీవు స్వామికి అంత సమీపమున ఉందువు. అమాయకుడగు బిడ్డ వెంట ఎప్పుడు తండ్రి యుండును. లోకవ్యవహార సమర్ధుడగు బిడ్డకు దూరముగా యుండును. రజోగుణములోను, సత్వగుణములోను అతి తెలివి ఎక్కువగా యుండును. తమోగుణియగు భీముడు లౌకిక శూన్యుడు. స్వల్పమైన జ్ఞానము మాత్రమే ఉన్నది. అది ఏమనగా పరమాత్మ కృష్ణునిగా అవతరించియున్నాడు. ఆయన ఆజ్ఞ శిరోధార్యము, ఆయన సేవయే కర్తవ్యము. ఇంతే అతడిలో స్వార్ధము, అహంకారము అసూయ లేనేలేవు. అదే నిజమైన సేవకుని లక్షణము. సేవకునకు అతితెలివి, ఎక్కువగా తర్కించుట పనికిరావు. గోపికలు కూడా పూర్వజన్మలో బ్రహ్మర్షులై యుండిరి. వారు మహా జ్ఞానులు సత్వగుణ సంపన్నులు కాన వారికి తన ఆలింగనము నీయ స్వామి నిరాకరించెను. వారు చదువులేని పామరులుగా పాలుపెరుగు అమ్ముకొను అజ్ఞానులుగా పుట్టి పురష అహంకారము కోల్పోయి స్త్రీ వినయముతో ఉన్నప్పుడే స్వామి వారితో రాస క్రీడ సల్పి వారిని తరింపచేసినారు. "అతర్క్యః" అని శ్రుతి చెప్పుచున్నది. అనగా స్వామిని గురించి ఎట్టి వితర్కము, విమర్శ మనస్సులో కూడా రాకూడదు. "నైషాతర్కెణ మతిరాపనీమ్‌" అను శ్రుతి కూడా మానవ మేధస్సు ఎంత తర్కించినను ఆయనను అర్ధము చేసుకొనలేమని చెప్పుచున్నది. ఆయన స్వతంత్రుడు, ఆయన సంకల్పమే ఈ సృష్టి, ఆయన ఇష్టమే ధర్మము, ఆయన చెప్పినదే వేదము, ఆయన నడచినదే మార్గము అను విశ్వాసము పరిపూర్ణముగా యుండుటయే పరాభక్తి. అహంకారము, అసూయ అను రెండు చీడపురుగులను వదిలించుకున్న చాలును. ఆయన మన చేతికి చిక్కినట్లే. స్వామి ఎల్లప్పుడును ఒక మానవ శరీరముతోనే ఈ భూమిపై నున్నాడనియే మహా వాక్యముల తాత్పర్యమని తెలిసినవాడే పండితుడు. "పండా" గలవాడె పండితుడు. "పండా" అనగా పరమాత్మ జ్ఞానమని అర్ధము అనగా పరమాత్మను గురించిన సత్యమైన జ్ఞానము.

1) "ఇహచేదదేతీత్‌" అను శ్రుతి ఈ లోకమున ప్రతితరములోను నరాకారమున ప్రత్యక్షమగుచున్న పరమాత్మను గుర్తించిన వాడే ఆస్తికుడనియు అట్లు గుర్తించక పరోక్ష భ్రమ ఉన్నవాడు శాశ్వత నష్టము పొందునని చెప్పుచున్నది.
2) "మానుషీంతను మాశ్రితమ్‌" అనుగీత నేను ఎల్లప్పుడు మనుష్య శరీరమునే ఆశ్రయించి యున్నాను. నన్ను మూఢులు తెలుసుకోలేరని చెప్పుచున్నది.
3) "యత్సాక్షాత్‌" అను శ్రుతి కూడా పరమాత్మ ఎక్కడో లేడు ఇక్కడే ఉన్నాడు అని చెప్పుచున్నది.
4) "ప్రజ్ఞానం బ్రహ్మ" అను మహావాక్యము ఆయన ప్రశస్త వేదాన్త జ్ఞానము గల పండిత గురువు అని చెప్పుచున్నది. ప్రజ్ఞానము ఎక్కువగా కలవాడు"ప్రజ్ఞాని" అని కాకుండా "ప్రజ్ఞానము" అనియే అనబడును. ఇది వ్యాకరణ శాస్త్ర సంప్రదాయము.
5) "అయమాత్మ బ్రహ్మ" అను మహావాక్యము ఇడుతో బ్రహ్మము జీవ రూపమున ఉన్నాడని చెప్పిచున్నది.
6) "తత్త్వమసి శ్వేతకేతో" అను మహావాక్యము ఓ శ్వేత కేతూ! ఆ పరమాత్మ నీ వలె మనిషిగా ఉన్నాడని చెప్పుచున్నది.
7) "అహం బ్రహ్మస్మి" అను మహావాక్యము అవును నేనే బ్రహ్మమును. నరరూపమున ఉన్నాను అని చెప్పుచున్నది.
8) "జీవభూత స్సనాతనః" అను గీత - ఆ సనాతనుడు ఒక జీవునిగా మారివున్నాడు అని చెప్పుచున్నది.
9) "జీవభూతాం మహాబాహో ఎ ఎదం ధార్యతే జగత్‌" అనుగీతా శ్లోకము నేను ఒక సామాన్య జీవ రూపమున ఉన్నను ఈ సర్వ జగత్తును ధరింయున్నాను అని చెప్పుచున్నది. మనుష్యరూపమున ఉన్న కృష్ణుడు సర్వజగత్తును ధరించి యుండుట విశ్వరూపము ద్వారా నిరూపించినాడు. ఆ మనుష్య రూపము పసిబాలునిగా అల్ప ప్రమాణముతో ఉన్నను జగత్తును ధరించియే ఉన్నానని యశోదకు తన నోటిలో సమస్త జగత్తును చూపెను.

At the lotus feet of Shri Dattaswami
-దుర్గాప్రసాద్

Sunday, October 4, 2009

త్యాగము చేతనే బ్రహ్మత్వము సిద్ధించును-అనఘాష్టమి సందేశము

[27.12.02] గురు స్వరూపము ఎప్పుడును శిష్యులు చేయు తప్పులను ఎత్తి చూపుచుండును. శిష్యుల యొక్క సద్గుణములను శిష్యులు సాధించినది గాని ప్రశంశించడు. శిష్యుడు చేసిన తప్పులను మాత్రమే వివరించి ఆ తప్పులు మరల జరగకుండా దిద్దుకొని శిష్యుడు పై స్ధాయికి చేరవలయునని గురువు ఎప్పుడును ఆలోచించు చుండును. నూటికి 99 మార్కులు తెచ్చుకున్నను గురువు దానిని ప్రశంసించడు. ఆ తప్పిపోయిన ఒక మార్కు గురించే విశ్లేషించును. ఆ ఒక మార్కు తప్పిపోయినందుకు శిష్యునికి ఉత్తేజపరచును. ఆ ఉత్తేజముచే మరల పరిక్షలో నూటికి నూరు మార్కులు తెచ్చుకొనవలయునని గురువు ఆశించును. గురువు తనను ప్రశంసించక విమర్శించు చున్నాడే అని శిష్యుడు గురువును అపార్ధము చేసుకొనరాదు. ప్రశంసించినచో అహంకారము పెరిగి ఈసారి పరిక్షలో 99 మార్కులు 90 మార్కులకే దిగజారును. అందుకే కబీరు ఇట్లు చెప్పినాడు. "నిన్ను తిట్టువాడు నీ మిత్రుడు". ఏలననగా ఆ తిట్లచేత నిన్ను నీవు దిద్దుకొని ఉన్నత స్ధితికి పోవుదువు. నిన్ను పొగుడువాడు నీ శత్రువు. ఏలననగా అతని పొగడ్త చేత నీవు అహంకరించి పతనము చెందుదువు. గురువు తన శిష్యుడెప్పుడు పైకి పోవలయుననియే ఆలోచించుచుండును. కావున గురువు శిష్యులలో కేవలము దోషములనే చూచును. ఒకసారి నానాచందోర్కర్‌ భగవద్గీతలోని శ్లోకమును చదువు చుండెను. "తత్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా, ఉపదేష్యంతిదే జ్ఞానం జ్ఞానిన తత్త్వ దర్శినః" అప్పుడు శ్రీ సాయి ఆ శ్లోకము యొక్క అర్ధము అడిగెను. నానా ఇట్లు చెప్పెను. నీవు గురువులకు సేవచేసి శరణాగతి చేసి ప్రశ్నించినప్పుడు వారు నీకు జ్ఞానమును బోధించెదరు అని. ఈ శ్లోకమునకు నానా ఇట్లు అర్ధము చెప్పెను. అప్పుడు శ్రీ సాయి ఇట్లు అడిగెను. జ్ఞానం అను శబ్ధము స్ధానములో అజ్ఞానం అని పెట్టినచో శ్లోకము యొక్క ఛందస్సుకు భంగమగునా? నానా "ఉపదేశ్యంతితేஉజ్ఞానం" ఇట్లు సవరించుట చేత శ్లోకము యొక్క అర్ధమునకు భంగము రాలేదు నానా ఇట్లు అడిగెను. "నేను గురువు వద్దకు పోయినప్పుడు జ్ఞానమునకు బదులు అజ్ఞానమును బోధించుటయా"? అని ఆశ్చర్యపోయెను.

అప్పుడు శ్రీ సాయి ఇట్లు పలికెను. గురువు ఎప్పుడును నీలో ఉన్న అజ్ఞానమునే వివరించును. దానిచేత నీ అజ్ఞానమును నీవు గుర్తించి ఆ అజ్ఞానమును పోగొట్టుకొనుటకు ప్రయత్నించును. అనగా నీ అజ్ఞానము చేత ఏర్పడుచున్న దోషముల గురించి ఆలోచించి గుర్తించి ఆ దోషములను దిద్దుకొని అప్పుడు నీవు జ్ఞానమునకు అర్హుడవగుదువు. కావున జ్ఞానము దానము చేయుటకు ముందు గురువు నీలోని అజ్ఞానమును తొలగించును. ఇంటికి అతిధి వచ్చినప్పుడు ఇల్లు ఊడ్చి శుభ్రము పరచుదువు. అదే విధముగా జ్ఞానము గ్రహించుటకు ముందు నీ అజ్ఞానమును తొలగించుకొనవలెను. నిన్ను జ్ఞానమునకు అర్హునిగా చేయు ప్రయత్నమే గురువు నీలోని తప్పులు పట్టుకొనుట, కావున గురుదత్తుడు ఎప్పుడును తన శిష్యులలో తప్పులు పట్టుచుండును. ఏలనననగా ఆయన పరిపూర్ణ గురుస్వరూపుడు. ఇది తెలుసుకున్నవాడు ఆయనకున్న వాత్సల్యమును గుర్తించును. ఇది తెలియని వాడు గురుదత్తుని విడచివేయును. ఈ రోజు అనఘాష్టమి. అనఘ ఎవరు? అనఘ అనగా ఆది జీవుడు. ఈ జగత్తును సృష్టించవలెనని పరమాత్మలో కలిగిన మొదటి సంకల్ప తరంగమే అనఘ. ఆ తరంగమే ఆత్మ లింగము అనబడును. ఈ అనఘయే మహామాయ, మూలమాయ అనబడుచున్నది. ఆమె అనఘ అనగా పాపరహిత. ఆమె పరమ పవిత్ర. ఎందులకు? ఆమెను సర్వసృష్టి సంపదకు అధిదేవతగా పరమాత్మ చేసియున్నాడు. కాని ఆమె దృష్టి సృష్టి మీద లేదు. ఆమె యొక్క దృష్టి సృష్టికర్తయగు పరమాత్మ మీదనే యున్నది. ఆమె స్వామి పాదముల వద్దనే కూర్చున్నది. ఆమె దృష్టి ఎల్లప్పుడు పరమాత్మ మీదనే వున్నవి. ప్రేమ, ధ్యానము అంతయు పరమాత్మ యందే వున్నవి. జ్ఞానము గాని, ధ్యానము గాని, భక్తి గాని, సేవలేనిచో వ్యర్ధము. కావుననే ఆమె చేతులు ఎల్లప్పుడు స్వామి పాదములను పిసుకుచున్నవి. ఇంత ఐశ్వర్యము లభించగనే అనేక మంది సేవకులనను తీసుకొందురు. కాని అనేక ఐశ్వర్యములు కలిగిన ఆమెయే సేవకురాలైనది. ఆమె ఆచరణ పూర్వక సేవచేయుచున్నది. ఈ రోజు అష్ట కలశములపై అనఘా దత్తుల యొక్క అష్టపుత్రులగు అష్టసిద్ధులను అష్టైశ్వర్యములగు అష్టపుత్రికలను ఆవాహనము చేయుదురు. అష్టసిద్ధులను ఆవాహనము చేసి అనఘా దత్తులను పూజించుదురు. దీనిలో అంతరార్ధమేమి? స్వామి మీదనే దృష్టిని ఉంచిన అనఘను జూచి దాని నుండి కర్తవ్యమును, తెలుసుకొని నీ దృష్టి స్వామిపై ఉంచెదవా? లేక అష్ట కలశములవున్న అష్టసిద్ధుల మీద, అష్టైశ్వర్యముల మీద దృష్టి ఉంచెదవా?

అష్టసిద్ధులు అష్టైశ్వర్యములు సృష్టికి సంబంధించినవి. దత్తుడు సృష్టికర్త. అష్టసిద్ధులు అష్టైశ్వర్యములు అనగా దత్తుల నుండి వచ్చినవి. ఇచ్చట యోగము అనగా స్త్రీ పురుషుల సంయోగము కాదు. సృష్టి సంకల్పమగు అనఘ సృష్టికర్తయగు స్వామిని చేరగా సృష్టి ఉద్భవించినది. కావున దీనిని బాహ్యార్ధములో తీసుకొనరాదు. అంతరార్ధమే జ్ఞానస్వరూపము. నీకు సృష్టి కావలయును? సృష్టికర్త కావలయునా? ఇదే దత్త పరిక్ష. నీ దృష్టి అష్టైశ్వర్యముల మీద అష్టసిద్ధుల మీద పోయినచో నీవు అష్ట కష్టముల పాలగుదువు. అట్లు కాక నీవు అనఘా దేవిని చూచినచో, ఆమె దృష్టి తన పుత్రులగు అష్టసిద్ధుల మీదన, తన పుత్రికలగు అష్టైశ్వర్యముల మీదన లేదని తెలుసుకొని ఆమె యొక్క దృష్టి సృష్టికర్త మీద యున్నదనియు కావుననే సృషికర్త ఆమెకు అష్టసిద్ధులను అష్టైశ్వర్యములను ఆమెకు ఇచ్చినాడు. నీ దృష్టి అష్టసిద్ధులు అష్టైశ్వర్యముల పైకి పోయినచో సృష్టికర్త వాటిని నీకు ఇచ్చును. ఇందులో సందేహము లేదు. కాని అవి సర్కస్‌ మాస్టరుగాని వాడు సర్కస్‌లోని సింహముల మధ్య నిలబడి వాటిని శాసించలేక వాటిచేత ఎట్లు తినబడునో అట్లే ఈ అష్టైశ్వర్యములను, అష్టసిద్ధులను నీవు నిగ్రహించుకొనలేక పోవుటచేత అవి నిన్ను మ్రింగిన నీవు అష్ట కష్టముల పాలగుదురు. వీటిని నిగ్రహించు శక్తి నీకు ఎప్పుడు వచ్చును. నీవు వాటి మీద దృష్టి ఉంచక సృష్టికర్తపై దృష్టి ఉంచిన అవి సృష్టికర్తను చూచి భయపడి కంట్రోలులో ఉండును. నీవు నీ నీడ చిక్కించుకొను ప్రయత్నములో ఉన్నప్పుడు ఎప్పటికి ఆ ఛాయను నీవు పట్టుకొనలేవు. కాని నీవు నీడ మీద దృష్టి ఉంచక, పరమాత్మ మీద దృష్టి ఉంచినచో, నీవు పరమాత్మ వైపుకు వెళ్ళినప్పుడు నీ నీడ నీతో నీదాసుని వలె అనుసరించును.

ఒక భక్తుడు భగవంతుని గురించి తపస్సు చేసెను. భగవంతుడు ప్రత్యక్షమై వరము కోరుకొనమనెను. భక్తుడు తాను సంకల్పించినది జరుగునట్లు వరము కోరుకొనెను. ఇది అష్టసిద్ధులలో ఒక సిద్ధి. భగవంతుడు ఆ వరమును ఇచ్చి మాయమైపోయెను. భక్తుడు ఇట్లు తలచెను. నాకు ఒక అందమైన భార్య కావలెననిన భార్య ప్రత్యక్షమైనది. అప్పుడు భక్తుడు నా భార్య వంటినిండా నగలు కోరగా అన్నియు ప్రత్యక్షమైను. భక్తుడు ఇట్లు తలచెను. "ఓ! ఏమి అమ్మవారి వలె ఉన్నది? అని అప్పుడు ఆమె అమ్మవారిగా మారెను. భక్తుడు ఇట్లు తలచెను. ఈ అమ్మవారు నన్ను మ్రింగునా ఏల?" . అప్పుడు ఆమె వానిని మ్రింగివేసెను. కావున నిగ్రహము లేనిదే అధిక ఐశ్వర్యము అష్టసిద్ధులు అష్టకష్టములకు దారితీయును. అనంత ఐశ్వర్యము అష్టసిద్ధులును నిగ్రహించ గలవాడు ఒక్క దత్తుడే. కావున నీ దష్టి సృష్టికర్తపై ఉన్నంత వరకు నీవు సృష్టి కర్తకు సమీపమున ఉందువు. అప్పుడు ఈ అష్టసిద్ధులను సింహములునూ, ఈ అష్టైశ్వర్యములను పెద్దపులులునూ నిన్ను ఏమియూ చేయలేవు. నీవు సమీపమున ఉన్నావు. కావున ఈ రోజు అనఘాష్టమి నుండి మనము పొందవలసిన జ్ఞానము ఏమనగా "సృష్టి మీద దృష్టి ఉంచక సృష్టికర్తపై దృష్టి ఉంచి, సృష్టికర్త యొక్క సేవలో నిరంతరము ఉండుచూ ఎంత ఐశ్వర్యము లభించినను, తాను యజమాని అను అహంకారము పొందక నేను ఎప్పుడు సేవకుడనని తెలుసుకుని రజస్తమో గుణ ప్రదానమైన అహంకారమును పొందక, సత్వగుణ ప్రదానమైన వినయముతో ఉన్నచో నీవును అనఘ వలె స్వామి యొక్క హృదయములో ప్రవేశింతువు". కావున అనఘాదేవిని ఆదర్శముగా పెట్టుకొని పాదముల వద్ద సేవకురాలిగా యుండి, అనఘ ఎట్లు హృదయాది దేవతా స్ధానము పొందినదో అట్లే నీవును స్వామి యొక్క హృదయము లోనికి ప్రవేశించవలెను. అనఘకు ఇచ్చిన ఐశ్వర్యము ఆమె ఎప్పుడు అను చలించ లేదు.స్వామి యొక్క భక్తులకు ఆమె దానము చేయుచున్నది. స్వామి నుండి పొందినది ఆమె ఇతరులకు పంచుచున్నది. కేవలము త్యాగము చేతనే బ్రహ్మత్వము సిద్ధించును. "త్యాగేనైకే అమృతత్వ మానసుః" భోగము చేత కాదు త్యాగము చేతనే బ్రహ్మత్వము సిద్ధించును. ప్రహ్లాదుడు నారదుని నుండి తాను పొందిన జ్ఞానమును తన చుట్టు ఉన్న బాలురు ఇచ్చుటకు ప్రయత్నించెను. అతడు ఆత్మోద్ధరణమునకు ఎప్పుడు ప్రత్నించలేదు. ఆత్మోద్ధరణము స్వార్ధము. అట్లే రాధయును ఇతర గోపికలకు కృష్ణుని గురించి ప్రశంశించి, వారిలో భక్తిని పెంచి, కృష్ణుడు వారికి ప్రియుడు కావలయునని తలచెను. రాధ ఎప్పుడు తన గురించి ఆలోచించలేదు. రాధ గోపికలకు నీడలాగా ఉండెడిది. నాయకుడి కర్తవ్యమేమి? నాయకుడు తన ప్రజల యొక్క శ్రేయస్సును కోరి సదా శ్రమించవలయును. కాని ఈ రోజు నాయకులు ప్రజల గరించి చింతించక తాము ధనము సంపాదించి, తమ ఆత్మోద్ధరమునకు, తమ కుటుంబ సభ్యుల అభివృద్ధికి ప్రయత్నిస్తున్నారు. కాని రాధ అటువంటి నాయకురాలు కాదు. ఏ స్త్రీ కూడా తనకు ప్రియమైన వానిని ఇతర స్త్రీలతో పంచుకొనుటకు ఒప్పుకొనదు.కాని రాధ కృష్ణునిపై తన ప్రేమను ఇతర గోపికలుకు పంచెడిది. అట్లు వారు ఉద్ధరింపబడుట కోరెను. ఆమె యొక్క త్యాగభావముతో కూడిన మధుర ప్రేమ చేతనే కృష్ణుడు రాధాలోలుడైనాడు. రాధ గురించి ఈ విషయము ఈనాటి వరకును ఎవ్వరికిని తెలియదు. ఇతర గోపికలు కృష్ణుడు ప్రేమించుచుండగా రాధ అలిగి కూర్చునట్లు వర్ణింతురు. కాని ఇది పూర్తిగా అసత్యము. సామాన్య స్త్రీ స్వభావము రాధపై రుద్దినారు. దత్తుడే కష్ణుడు రాధయే అనఘ. ఈ అనఘాష్టమి పుణ్యదినమున ఈ సత్యమైన అనఘా తత్త్వమును దత్తుడగు నేను బయిట పెట్టుచున్నాను. ఈ విధముగనే శంకరులు పరమాత్మ నుండి జ్ఞాన సంపదను పొందినారు. కాని ఆయన ఏమి చేసెను. శంకరులు భారతదేశమంతయు కాలి నడకతో సంచరించి గ్రామ గ్రామమునకు పోయి ఆ జ్ఞానమును ఇతరులకు బోధించి వారి అజ్ఞానమును తోలగించెను.కావున ఆయన దైవము నుండి పొందన జ్ఞానమును తన ఆత్మోద్ధరణమున కొరకు ఇంటిలో కూర్చునలేదు. ఆయనన ఆయన యొక్క ఉద్ధరణము గురించి చింతిచలేదు. ఆయన జీవితమంతయు జ్ఞానబోధలతో గడచిపోయెను. పరులను ఉద్ధరించు జ్ఞానములోనే ఆయన జీవతమంతయు గడిపెను. నేను దేవుడనే మీరును దేవుడే అని తాను పొందనది ఇతరులు పొందినట్లుగా భావించినాడు. కావున సేవ ఎప్పుడు ఇతరుల కోసమే ఉండవలయును. నీ ఆత్మోద్ధరణకు కారాదు. నీవు ఇతరులను ఉద్ధరించుటకు ప్రయత్నించినచో నీవు స్వామిచే ఉద్ధరించబడుదువు. ఇతరులు ఉద్ధరించబడినను, ఉద్ధరించబడకపోయిననూ ఫలమును గురించి నీకు అనవసరము. నీవు మాత్రము ఇతరుల ఉద్ధరణమును సదా ప్రయత్నించుచుండవలెను. నీ ప్రయత్నము చెడినను నీవు ఆ ప్రయత్నములో నిరంతరము ఉండుము. నీవు అంత్యక్షణము వరకు అట్టి ప్రయత్నములో ఉన్నచో భగవంతుడు సంతోషించి నిన్ను మాత్రము ఉద్ధరించును. కావుననే శంకరులను చివరిలో దత్తుడు కౌగలించి తనలో లీనము చేసుకొన్నాడు. అట్లే మీరాబాయి భక్తిని ప్రచారము చేసినది. ఇతర జీవులను తన గానముతో కృష్ణ భక్తులుగా మార్చుటకు ప్రయత్నంచెను. కావుననే జగన్నాధ దేవాలయములో మీరాకు సశీరీరముగా ఐక్యము చేసుకున్నాడు. దత్తుడు సృష్టికర్త, సృష్టిభర్త, సృష్టిహర్త. ఇవియే బ్రహ్మ, విష్ణు, శివస్వరూపములు. సృష్టికర్తగా కొందరు అభిమానించి దత్తుని తల్లితండ్రిగాను, పుత్రునిగాను, లేక సోదరునిగాను ఆరాధించిరి.

ప్రహ్లాదుడు తండ్రిగాను, దశరధుడు, నందుడు పుత్రునిగాను, లక్ష్మణుడు అన్నగాను ఆరాధించినారు. లక్ష్మణుడు కూడా స్వామిని నిరంతర సేవ చేయుచు స్వామి కార్యమైన యుద్ధములో పాల్గోనెను. మరికొందరు భక్తులు స్వామిని సృష్టిభర్తగా పతిగా ప్రియునిగా ఆరాధించినారు. రుక్మిణి రాధలు దీనికి ఉదాహరణ. సత్యభామ ఎప్పుడు స్వామి తన వద్దనే ఉండవలయుని కోరుకొన్నది. కాని రుక్మిణి స్వామి అష్టభార్యలను పంచుకొనవలయునని తలచినది. కావుననే తులాభారము నందు రుక్మిణి గెలిచి సత్యభామ ఓడిపోయినది. కాని రుక్మిణి కన్న రాధ గొప్పది. ఏలననగా స్వామి 16 వేల గోపికలు పంచుకొనవలెనని కోరినది. కావున రుక్మిణి త్యాగము కన్న రాధ త్యాగము గొప్పది. కావుననే రాధ ముందు రుక్మిణి ఓడిపోయినది. ఒకనాడు రాధ బృందావనము నుండి ద్వారకకు వచ్చెను. రుక్మిణి తాను రోజు తాగు వేడిపాలు రాధకు యిచ్చెను. రాధ దానిని స్వీకరించినది. ఇరువురు స్వామి వద్దకు పోగా స్వామి ఎర్రగా కందియుండెను. ఇరువురు ఆశ్చర్యపడి అడిగిరి.

స్వామి పలికెను. రాధ వేడి పాలు తాగినది. రాధ హృదయములో నేనున్నాను. కావుననే కందిపోయినాను. అప్పుడు రుక్మిణి అడిగినది. నాధా!ఐతే వేడి పాలను నేను రోజు తాగుతున్నాను గదా! కాని నీవు ఏనాడు కందిపోలేదు. నీవు నా హృదయము నందు లేవా? స్వామి ఇట్లు పలికెను ఓ రుక్మిణి! నీ ప్రేమ కన్న రాధ ప్రేమ గొప్పది. నీవు నన్ను అష్ట భార్యలతో మాత్రమే పంచుకొను చున్నావు. కాని రాధ బృందావనములో పదునారువేల గోపికలతో కలసి నన్ను పంచుకొనుటకు సిద్ధపడినది. కావున ఆమె త్యాగము నీ త్యాగము కన్న గొప్పది. మరియును నీవు నిత్యము నా సహచర్యములో ఉన్నావు. కావున నీకు నా యందు నిర్లక్ష్యము ఏర్పడినది. కావున నా విలువ పోయినది. రాధ దూరముగా యున్నది కావున ఆమెకు వియోగము నందు నాపై శ్రద్ధ ఎక్కువగా యున్నది. భగవంతుడు మనకు కనపడకుందా ఎందుకున్నాడు? ఆయన కనపడక దూరముగా యున్నచో మనకు ఆయన పై విలువ పెరిగి మనము తరింతుము. కావున మన శ్రేయస్సు కోరి మనకు కనబడకున్నాడు. ఒక వేళ నరరూపములో వచ్చినచో అప్పుడును కొంతకాలము మాత్రమే ఉండి తరువాత అవతారము చాలించుచున్నాడు. ఆయన నిరంతరము మనతో ఉన్నచో ఆయన పై మనకు నిర్లక్ష్యము ఏర్పడును. స్వామితో నిరంతరము యాదవులు ఉన్నారు. చిన్ననాటి నుండియు కాళీయమర్ధనము, గోవర్ధనము నెత్తుట చూచినారు. స్వామి కురుక్షేత్ర యుద్ధమునకు పోవుచు నేను వచ్చు వరకు మద్యమును ఎవరు సేవించవలదని ఉత్తర్వులిచ్చియుండెను. దీనికి కారణము ఏమనగా యాదవులు మద్యము త్రాగినచో దుర్వాస శాపము వలన వారు కలహించి మరణింతురనియే, కాని యాదవులు ఉత్తర్వులను నిర్లక్ష్యము చేసిరి. కృష్ణుడు 19 రోజున తిరిగి వచ్చెను. కాని అప్పటికే యాదవులు మద్యము సేవించి, కొట్టుకొని, చంపుకొనిరి.

మరి చిన్ననాటి నుండియు ఎన్నో మహిమలను చూచిన యాదవులు కృష్ణుని ఉత్తర్వులు ఏల ధిక్కరించిరి? దీనికి కారణము కృష్ణుడు నిరంతరము యాదవులతో ఉండుటయే. నిరంతర సాన్నిధ్యము, సహచర్యము యాదవుల దృష్టిలో కృష్ణుని విలువ పోగొట్టినది. అందువలననే భగవంతుడు కనిపించడు. కనిపించినను 10 నిమిషములే కనిపించి అదృశ్యుడగుచున్నాడు. ఎందుకనగా తన పై విలువను నిలుపుకొనుటకే. కావున త్యాగముతో కూడిన సేవ కలిగి జపము, ధ్యానము, భజన చేయుచున్నచో అవి సార్ధకములగును. ఇవి అన్నియు శరీర అవయవములు అయినచో త్యాగముతో కూడినచో సార్ధకము. ప్రాణమున్ననే శరీరావయవములకు విలువ యున్నది. ఎంత గొప్పవాడైనను వాని నేత్రములు కత్తిచే పెకిలింపబడుచున్నవి. అది పుణ్యకర్మ యగుచున్నది. నేత్రదానమున కత్తితో పెకిలించుట పాపమగుటలేదు? ఎందులకు? ప్రాణము పోయినది కాన శరీరము విలువలేదు. కాని అదే కన్నులు ఒక కౄరమైన జంతువునకు పెకిలించినచో అది మహాపాపము అగుచున్నది. ఎందులకు? ప్రాణమున్నది కాన కండ్లకు, శరీరమునకు విలువయున్నది. హనుమంతుడు రామనామ జపము చేసెను. రామ భజన చేసెను. రామధ్యానము చేసెను. కాని ఎప్పుడు? రాముని కార్యము ముగిసిన తర్వాత . వారధి నిర్మాణము కొరకు రాముడు కూర్చుని యుండగా, లేక రామరావణ యుద్ధ సమయములో భజనలు చేయలేదు. రామకార్యములో పాల్గోనెను. యుద్ధము ముగిసిన తర్వాత రాముడు సింహాసనారూఢుడైన తర్వాత రామపాద సేవ చేయుచు అప్పుడునూ వ్యక్తిగతముగాను సేవను విడనాడలేదు. సేవ చేయుచునే యుండెను. రాముడు తన శరీరమును విడిచిన తర్వాత ఆయన పాదసేవ లభించనందున ఆయన కార్యములో పాల్గొనుటకు అవకాశము లేనందున కదళీవనములో యుండి ఆయన భజన, రామనామ జపము చేసెను. అంతేకాక దత్తుడు ఎప్పుడెప్పుడు అవతరించుచున్నాడో అప్పుడప్పుడు ఆయన సేవకునిగా అవతరించెను. కృష్ణావతారములో ఆయన తన అంశతో భీమునిగా జన్మించెను. కావున దత్త భక్తులారా! స్వామి జ్ఞానమును భక్తిని ప్రచారము చేయుటకు వచ్చినారు. మీ జపమును, తపములను, మీ నిత్య పూజలను విడనాడి స్వామి కార్యములో పాల్గోనుడు. స్వామి ఈ శరీరమును వదలి దేవగఢకు వెళ్ళిన తర్వాత అప్పుడు మీ మీ పూజలు మీరు చేసుకొనవచ్చును. స్వామి కార్యార్ధియై వచ్చియుండగా స్వామి కార్యమున పాల్గొనక మీ సాధనల యొక్క అవసరమేల? ఇదియే అనఘాష్టమి నాటి స్వామి సందేశము.

శ్రీ కృష్ణభగవానుడు 6 నిమిషముల పాటు కారాగారకులో ఉండెను గదా. అంటే శ్రీ కృష్ణుడు కారాగారములో జన్మించి 6 నిమిషముల పాటు కారాగారములో యున్నారు గదా! దీనికి కారణము శ్రీ దత్తభగవానుడు ఇలా వచించినారు. "రామావతారములో అరణ్యవాసములో భరతుడు వచ్చి శ్రీ రామునికి దశరధుని మరణవార్త విన్నవించి, రాజ్యమును స్వీకరించవలసిదిగా ప్రార్ధన చేసిన సందర్భములో జాబాలి మహర్షి శ్రీ రామునకు రాజ్యము స్వీకారము చేయమని బోధించినాడు. అప్పుడు శ్రీ రాముడు జాబాలికి జ్ఞానోదయము కల్గించటం, జాబాలి తన అజ్ఞానాన్ని తొలగించుకుని శ్రీ రామునికి దాసోహమనటం జరిగినది. కాని రావణాసురుని విషయములో ఇట్టి జ్ఞానోపదేశము చేయలేదు. సంహరించినాడు. ఆ తర్వాత కాలభైరవుల సమక్షంలో రావణాసురుడు ఈ విషయమై ఫిర్యాదు చేయగా అప్పటి రామావతారము చాలించిన శ్రీ దత్తుడే ముద్దాయిగా నిలబడ వలసివచ్చనది. జాబాలి బ్రాహ్మణుడనియు, తాను బ్రాహ్మణుడనే గదా, జాబాలి తపసంపన్నుడైతే తాను తపసంపన్నుడనే గదా. కనుక జాబాలి విషయములో ఒక న్యాయము తన విషయములో మరొక న్యాయము ఉండరాదు గదా. శ్రీ రాముడు జాబాలికి జ్ఞానోదయము కల్గించినట్లుగా, సకాలంలో తనకు జ్ఞానోదయం కల్గించ వచ్చును గదా. అట్లు చేయక శ్రీ రాముడు పక్షపాతముతో వ్యవహరించినాడను వాదనకు కాలభైరవులవారు ఏకీభవించి శ్రీ దత్తునకు 6 చేతలకు సంకెలలు చేయించి 6 నిమిషములు కారాగార శిక్ష విధించినారు. ఆ శిక్షను శ్రీ దత్తుడు శ్రీ కృష్ణావతారములో 6 నిమిషములు కారాగారంలో ఉండి అనుభవించారు. ఇది రహస్యం అని వివరించారు.
At the lotus feet of Shri Dattaswami
-దుర్గాప్రసాదు